నేటి బాలలే రేపటి పౌరులు. వారి శరీరవికాసానికి పౌష్టికాహారమూ, ఉల్లాసానికి ఆటపాటలూ కావాలి. వ్యక్తిత్వవికాసానికి చదువు కావాలి. అన్నింటికీ మించి, మానసిక వికాసానికి కథలు కావాలి. ఆ కథలు సంప్రదాయపు గొప్పతనాన్నిచెప్పాలి. ప్రపంచాన్ని పరిచయం చేయాలి. తప్పొప్పులు వివరించాలి. క్రమశిక్షణని ప్రబోధించాలి, నవ్వించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అవీ చదువే అనిపించాలి. అవే చదువనిపించాలి.
ఈ ఆశయంతో వేలాది పిల్లల కథలు వ్రాశారు వసుంధర. వీటిలో బ్రహ్మరాక్షసులు, దుష్టమాంత్రికులు, దుర్మార్గంలో వారికి సాటివచ్చే క్రూరమానవులూ ఒకపక్క. వారిని ఎదుర్కునే (అ)సామాన్యులు మరొకపక్క, వీరి పోరాటంలో గెలుపుకి ‘కండబలం, బుద్ధిబలం, ధైర్యసాహసాలు’ ఉంటే సరిపోదు. పరోపకారమే ఆశయంగా, నిస్వార్థమే ఆదర్శంగా, మంచితనమే ఆచరణీయంగా పెట్టుకోవాలి. వారు అసాధ్యాల్ని సుసాధ్యాలుగా ఎలా మార్చగలరో ‘దుష్టుల్ని ఎలా ఏమార్చగలరో’ నమ్మశక్యంగా ప్రదర్శించే ఈ కథలు ఆద్యంతం నవరసపూరితం, ఉత్కంఠభరితం, ఆసక్తియుతం, చమత్కారకలితం.
పిల్లలకివి మానసికవికాసం. పెద్దలకివి సత్కాలక్షేపం. పిల్లలు, పెద్దలు అందరికీ ఇవి ఉల్లాసం, ఉత్సాహం.
వసుంధర రచనల్లో కొన్నింటినిక్కడ సగర్వంగా సమర్పిస్తున్నాం.