అది భారతదేశ యశః చరిత్రలో సువర్ణాధ్యాయం! తనదైన వైభవాన్ని మరచి జాతి పరదాస్యంలో మగ్గుతున్నప్పుడు, కన్నుల పండుగ చేసిన మహోజ్వల స్వాతంత్య్ర దివ్యేందూదయ మనోహర దృశ్యం.
భారతీయులు విజాతీయుల పాదపీఠికడ మోకరిల్లిన దుస్సహ కాలంలో బీజప్రాయంగా, అంగారకణంగా పొలుమరించి, కాల క్రమేణ వటవృక్షసదృశంగానూ, మహాదవానలంగానూ పరిణమించి విజాతీయులకు గుండెదడ కలిగించిన మహావ్యక్తి చరిత్ర !
ఒక్కొక్క వ్యక్తి పుట్టుకతో నిద్రాణమై తనను తాను మరచి మత్తిల్లి మైకంలోవున్న జాతి జాగృతమై వొళ్ళు విరుచుకుని సంకెళ్ళ ఛేదించుకుని యధాపూర్వవైభవాన్ని సాధించుకుంటుంది.
కొండకు దీటైన వైరిశక్తిని పిండి చేయగల బలం లేకపోయినా చిట్టెలుకవలె తవ్వి తవ్వి కకావికలు చేయగలిగిన శేముషీసంపన్నులు చరిత్రను మలుపుతిప్పి చరిత్రలో చిరాయువులై నిలిచిపోతారు.
అట్టి మహావ్యక్తి-ఛత్రపతి శివాజీ. అతని బాల్యమూ, జీవితమూ, విజయాలు, లోపాలు అతని జీవితంలో ప్రవేశించి ప్రభావితుణ్ణిచేసి గంగవరచి అద్భుత వ్యక్తుల వృత్తాంతమూ – అంతా వెరసి ఒక మహాద్భుత చారిత్రగాధ! ధర్మవీరుడైన శివాజీ యశోగాధ!